మహబూబ్నగర్ : జడ్చర్ల, అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై కొనసాగుతుంది. పుర ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. జడ్చర్లలో బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాల, అచ్చంపేటలో జేఎంజే ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టారు. తర్వాత బ్యాలెట్ డబ్బాలను తెరిచి రౌండ్లవారీగా ఓట్లను లెక్కించనున్నారు.
జడ్చర్లలో 27 వార్డుల్లో మొత్తం 112 మంది, అచ్చంపేటలో 20 వార్డుల్లో 66 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జడ్చర్లలో 5 గదులు, 19 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 84 మంది సిబ్బంది, 9 మంది రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. అచ్చంపేటలో ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు. 60 మంది సిబ్బంది, ఏడుగురు రిటర్నింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియనంతా వెబ్కాస్టింగ్ ద్వారా రికార్డు చేస్తున్నారు.