గ్రేటర్లోనే మొదటి స్థానంలో..
రూ.10.20 కోట్ల ఆస్తిపన్ను చెల్లింపులు
నేడు ఒక్కరోజే అవకాశం
కాప్రా, ఏప్రిల్ 29: సర్కిల్లో ఎర్లీబర్డ్ ఆస్తిపన్ను చెల్లింపులు జోరుగా కొనసాగుతున్నాయి. 5శాతం రిబేటుతో ఇంటిపన్నులు చెల్లించే అవకాశాన్ని సాధారణ ప్రజలతో పాటు సర్కిల్ పరిధిలోని పలు పెద్ద సంస్థలు సైతం సద్వినియోగం చేసుకుంటున్నాయి. సర్కిల్ పరిధిలోని ఎన్ఎఫ్సీ, ఈసీఐఎల్ వంటి బడా సంస్థలు భారీగా ఉండే ఆస్తిపన్నును చెల్లించి ఐదు శాతం రిబేటును పొంది లబ్ధిపొందుతున్నాయి. మరోవైపు సర్కిల్ రెవెన్యూ సిబ్బంది కాలనీల్లో పర్యటించి ఎర్లీబర్డ్ చెల్లింపులపై ఇంటి యజమానులకు అవగాహన కలిగిస్తున్నారు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలకు హాజరవుతూ ఇంటి యజమానుల నుంచి ప్రస్తుత ఆస్తిపన్ను చెక్కులను స్వీకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఆస్తిపన్ను ముందస్తు (ఎర్లీబర్డ్) చెల్లింపు పథకానికి శుక్రవారం ఆఖరు రోజు కావడంతో ప్రజలు పన్ను చెల్లించేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు.