ధర్మపురి, ఏప్రిల్ 12 : రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ గొర్రెల యూనిట్ల క్రయవిక్రయాలకు ప్రయత్నించిన 18 మందిపై కేసు నమోదు చేసినట్లు ధర్మపురి సీఐ రామ్చందర్రావ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం యాదవ కుటుంబాలకు గొర్రెల పంపిణీ పథకం కింద రూ.లక్షా 25 వేల యూనిట్ విలువతో 20 గొర్రెలు, ఒక పొట్టేలును పంపిణీ చేస్తుండగా.. ఇందులో లబ్ధిదారుడు తన వాటా కింద యూనిట్ విలువలో 25 శాతం అంటే రూ.31,250 డీడీ రూపంలో చెల్లించాలి. 75 శాతం ప్రభుత్వ సబ్సిడీ అంటే రూ.93,750 అందిస్తున్నది. అయితే తుమ్మెనాల పంచాయతీ పరిధిలోని గొల్లపల్లెకు చెందిన 12 మంది లబ్ధిదారులకు 12 యూనిట్లు మంజూరు కాగా.. ఆ గొర్రెలను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగులవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చింది. కానీ, ఆ గొర్లను తిరిగి నాగులవరానికే చెందిన వ్యక్తికే తక్కువ ధరకు (ఒక్క యూనిట్ రూ.72 వేలు) విక్రయించేందుకు లబ్ధిదారులు ఒప్పంద పత్రం రాసిచ్చారు. తీరా గొర్రెలు ధర్మపురికి చేరాక ధర విషయంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరుపక్షాలను స్టేషన్కు తరలించారు. వెటర్నరీ ఏడీ శ్రీధర్ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన లబ్ధిదారులైన 12 మంది, కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన దళారులు ఆరుగురు మొత్తం 18 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..
సాగర్ వెనుకబాటుకు జానారెడ్డే కారణం : హోంమంత్రి