న్యూఢిల్లీ: మీరు మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయించుకున్నారా..? అయితే మీరు నిశ్చితంగా ఉండవచ్చు. ఒకవేళ లింక్ చేయించుకోకపోతే మాత్రం ఈ నెల 31 లోగా తప్పకుండా లింక్ చేయించండి. లేదంటే మీ ఆధార్ కార్డు పనిచేయకుండా పోవడమేగాక, మీరు జరిమానా కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఆర్థిక బిల్లు-2021కి కీలక సవరణ చేసి ఆమోదించింది. ఆ సవరణ ఏందంటే ఇన్కం ట్యాక్స్ చట్టం-1961లో కొత్తగా 234హెచ్ సెక్షన్ను చేర్చింది.
ఆ కొత్త సెక్షన్ ప్రకారం పాన్కార్డు ఉన్నవాళ్లంతా ఆధార్ కార్డుతో దాన్ని లింక్ చేయించుకోవాలి. లేదంటే భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఆ జరిమానా ఎంత అనే విషయాన్ని ప్రభుత్వం త్వరలోనే నిర్ణయించనుంది. కాగా, జరిమానా మొత్తం రూ.1000కి మించకుండా ఉండవవచ్చుననే అంచనాలు వెలువడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం సవరించిన చట్టం ప్రకారం పాన్కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నెల 31లోగా ఆధార్తో తమ పాన్ సంఖ్యను అనుసంధానం చేయించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తాజా బడ్జెట్ ప్రతిపాదనలు 2021, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఒకవేళ ప్రభుత్వం పాన్, ఆధార్ అనుసంధానం గడువును గనుక పొడిగించకపోతే.. మార్చి 31లోగా అనుసంధానం చేయించనివారు రూ.1000కి మించకుండా జరిమానా చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం.. ఏ వ్యక్తినైనా తన పాన్ను సమర్పించాలని అధికారులు కోరినపుడు ఆ వ్యక్తి తన పాన్ను సమర్పించకపోయినా, పనిచేయని పాన్ను సమర్పించినా ఆ వ్యక్తి అధిక టీడీఎస్ లేదా టీసీఎస్ను చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా ఇన్కం ట్యాక్స్ రిటర్న్లను దాఖలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇన్కం ట్యాక్స్ రిటర్న్లను సమయానికి దాఖలు చేయకపోతే దానికి సంబంధించిన పర్యవసానాలను కూడా ఎదుర్కోవాల్సి పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ గడువులోగా తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయించుకోవడం ఉత్తమం.