జిల్లాలో ఇంటింటి ‘జ్వర సర్వే’ ముమ్మరం
వడివడిగా కదులుతున్న బృందాలు
ప్రతి వెయ్యిమందికో టీం
కుటుంబ వివరాల సేకరణ
లక్షణాలుంటే నమోదు
బాధితులకు అక్కడికక్కడే మందులు
వీలైతే హోం ఐసొలేషన్
లేదంటే ప్రత్యేక సెంటర్లకు..
అత్యవసరమైతే దవాఖానలకు తరలింపు
కొవిడ్ బాధితులను మొదట్లోనే గుర్తించే వీలు
మరణాల రేటు తగ్గించేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు
వైద్యశాలలపై భారం పడకుండా కార్యాచరణ
జనగామ, మే 6 (నమస్తే తెలంగాణ) : కరోనా మాయ రోగం కోరలు చాచింది. ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తున్నదో.. అంతే వేగంగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నది. మహమ్మారిని ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ఇంటింటికీ ‘జ్వర సర్వే’ను గురువారం నుంచి ప్రారంభించి పకడ్బందీగా చేయిస్తున్నది. ఇందుకోసం వెయ్యిమందికి ఒక బృందాన్ని నియమించింది. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలు సేకరించి, ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే నమోదు చేసుకుని అక్కడికక్కడే మందులు అందించనుంది. కొవిడ్ బాధితులను వీలైతే హోం ఐసొలేషన్ చేయడం, లేదంటే ప్రత్యేక కేంద్రాలకు పంపడం, అత్యవసరమైతే దవాఖానకు తరలించి క్షేత్రస్థాయిలోనే కొవిడ్ను నియంత్రించడం ఈ సర్వే ముఖ్య ఉద్దేశం కాగా ప్రజల్లో ఆరోగ్యంపై భరోసా వ్యక్తమవుతున్నది.
ఆరోగ్య తెలంగాణ ధ్యేయంగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కరోనా విస్తృతిని ముందే నియంత్రించే దిశగా పకడ్బందీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఇంటింటి జ్వర సర్వే ద్వారా దవాఖానలపై భారం తగ్గించే అద్భుతమైన కార్యక్రమం మొదలైంది. కరోనా బారిన పడిన వారిని ముందే గుర్తించడం ద్వారా వారికి భరోసా ఇవ్వడం, లక్షణాలున్న వారికి ఇంట్లోనే చికిత్స అందించడం వల్ల 25 నుంచి 30శాతం వరకు దవాఖానలపై భారం తగ్గనుంది. ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేసే బృందాలకు ఆయాగ్రామాలు, పట్టణ వార్డుల్లోని ఏఏ ఇండ్ల లో పేషెంట్లు ఉన్నారో తెలియడం సహా బాధితులను ఆదుకోవడం, వైద్య సాయం అందించడం సులువవుతుంది.
ఒకట్రెండు రోజుల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ల్యాబ్
జిల్లా ప్రధాన వైద్యశాల సహా పీహెచ్సీల్లో కొవిడ్ ఔట్ పేషెంట్ సేవలు మొదలయ్యాయి. జిల్లా దవాఖానలో ఒకట్రెండు రోజుల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ల్యాబ్ కూడా ప్రారంభం కానుంది. జ్వర సర్వేలో కరోనా లక్షణాలున్న వారికి వైద్య సలహాలు అందించి వెంటనే కిట్ ఇవ్వడంతోపాటు బాధితులతో వైద్య బృందం టెలీమెడిసిన్ ద్వారా ఫోన్లో నిత్యం మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి వెయ్యి మందికి ఒక బృందం చొప్పున ఇంటికి వెళ్లి పరీక్షలు చేయడం సహా మందులు ఇవ్వడంతో పాటు పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానల్లో ఔట్ పేషెంట్ సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. జ్వర సర్వేలో భాగంగా క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇంటింటికీ వెళ్తున్నారు. లక్షణాలున్న వారిని పరీక్షించి బాధితులను గుర్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం జనగామ మునిపాలిటీలోని 30 వార్డులు సహా అన్ని గ్రామాల్లో ప్రతి 250 ఇండ్లకు (ప్రతి వెయ్యి మందికి) 315 బృందాలు సుమారు 18,012 వేల ఇండ్లను ఏఎన్ఎం, ఆశ వర్కర్, మున్సిపాలిటీ లేదా పంచాయతీ సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందం సందర్శించి సర్వే చేపట్టింది. జ్వరం, పల్స్, ఇతర ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేసి కొవిడ్ లక్షణాలుంటే వివరాలు నమోదు చేసుకొని అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లు అందిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, మందులు ఎలా వాడాలో తదితర వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ వారం పాటు జ్వరం తగ్గకపోతే స్టెరాయిడ్ మందులు కూడా అందిస్తారు.
ఫీవర్ సర్వే ఇలా..
కొవిడ్ నియంత్రణలో భాగంగా జనగామ జిల్లా వ్యాప్తంగా గురువారం ఇంటింటి ఫీవర్ సర్వే మొదలైంది. మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లోని ఇండ్లలో సర్వే చేపట్టారు. ఏఎన్ఎం, ఆశవర్కర్, మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. థర్మల్స్కానర్, ఆక్సీమీటర్తో ప్రతి ఒక్కరినీ చెక్ చేస్తున్నారు. జ్వరంతో ఉంటే అక్కడికక్కడే మందులు, కరోనా కిట్ అందిస్తున్నారు. బాధితులతో వైద్య బృందం టెలీమెడిసిన్ ద్వారా ఫోన్లో మానిటరింగ్ చేస్తున్నారు. తీవ్రతను బట్టి హోం ఐసొలేషన్లో ఉంచుతున్నారు. ఇంటిలో సరైన వసతులు లేకుంటే కొవిడ్ కేర్కు తరలిస్తున్నారు. స్వల్ప లక్షణాలుంటే ఐదురోజులకు సరిపడా మందులు, యాంటీ బయోటిక్స్ అందిస్తున్నారు. తీవ్ర జ్వరం ఉండి.. శ్వాస ఇబ్బంది ఉంటే దవాఖానకు వెళ్లాలని సూచిస్తున్నారు.
అందుబాటులో పడకలు..
జిల్లా ప్రధాన వైద్యశాలలోని రెండు కొవిడ్ జనరల్ వార్డుల్లో 68 ఆక్సిజన్ బెడ్లతోపాటు హన్మకొండ రోడ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రత్యేకంగా 100 బెడ్లతో ఐసొలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. వీటికితోడు బచ్చన్నపేట 30 పడకల పీహెచ్సీలో 10బెడ్లు, జఫర్గఢ్ 30 పడకల దవాఖానలో 10బెడ్లు సహా మిగిలిన 17 పీహెచ్సీల పరిధిలో ఆరు పడకల సామర్థ్యంతో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంచారు. జిల్లా ప్రధాన దవాఖానలోని రెండు జనరల్ వార్డుల్లో మొత్తం 46 మంది పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. రెండు ఐసీయూ వార్డుల్లో 12 మంది ఉండగా నాలుగు బెడ్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా ఐసీయూ-8, వెంటిలేటర్ పడకలు-8, సాధారణ పడకలు-22 సహా జిల్లా దవాఖానలో మొత్తం 84 పడకలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం జనగామ జిల్లా వైద్యశాలను పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మార్చారు. ధర్మకంచ అర్బన్ హెల్త్ సెంటర్ సహా జిల్లాలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నారు.