చివరి గింజ వరకూ కొంటాం
కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్
జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
జమ్మికుంట రూరల్/హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 19: రైతులు పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను ఆశ్రయించవద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లో, హుజూరాబాద్ మండలంలోని రాజపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈటల సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ యాసంగిలో సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో మంచి పంట దిగుబడి వచ్చిందని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని కొనుగోలు కేంద్రాల్లో చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతు బ్యాంకు ఖాతాలో డబ్బు జమవుతుందని చెప్పా రు. గన్నీ బ్యాగులు, హమాలీ, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేకుండా కాంటా అయిన వెంటనే తరలించేందుకు సహకరించాలని మార్కెట్ సిబ్బందికి, నాయకులకు సూచించారు.
కరోనా విజృంభిస్తున్న తరుణంలో రైతులందరూ తగిన జా గ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూ చించారు. వైరస్ లక్షణాలున్నవారు ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే హాస్పిటల్లో అడ్మి ట్ కావాలని సూచించారు. అనంతరం హమాలీ సంఘ భవనాన్ని పరిశీలించిన ఈటలకు భవన మరమ్మతులకు కావాల్సిన నిధులు కేటాయించాలని సంఘం ప్రతినిధులు కోరా రు. వీటితోపాటు జమ్మికుంట పట్టణంలోని పీవోపీ వర్క్స్ మెటీరియల్ సెంటర్ను ప్రారంభించారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, ఎంపీపీ దొడ్డె మమత, ప్యాక్స్ చైర్మన్లు పొనగంటి సంపత్, అనుమాండ్ల శ్యాంసుందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ వాల బాలకిషన్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్, సర్పంచ్ సరిత, మార్కెట్ డైరెక్టర్లు ఉన్నారు.