వరంగల్ అర్బన్ : వేసవి సమీపించింది. కాసేపు అలా బయటకు వెళ్లి రాగానే ఎండ వేడిమి తట్టుకోలేక వచ్చిరావడంతోనే మొదటగా త్రాగునీరే అడుగుతుంటాం అందరం. మరి ఈ సీజన్లో ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొనే మిగతా జీవరాశి పరిస్థతి ఏంటీ? ఎప్పుడైనా ఆలోచించారా నీటి జాడల కోసం వాటి అన్వేషణ. ఇలా ఆలోచించిన కాకతీయ యూనివర్సిటీకి చెందిన సామాజిక, పర్యావరణవేత్త పీహెచ్డీ స్కాలర్ మొహమ్మద్ అజాం తన స్నేహితులతో కలిసి సహాయక చర్యలకు ఉపక్రమించాడు.
వర్సిటీ ఆవరణలోని చెట్లకు చిన్న చిన్న గిన్నెల వలె బాటిల్స్ను వ్రేలాడదీసి అందులో పక్షులు త్రాగేందుకు నీళ్లు నింపారు. కోలిపాక ప్రకాశ్, సోరుపాల అనిల్, దావేళ్ల రాకేశ్లతో కలిసి ఆజాం పక్షుల దాహార్తి తీర్చేందుకు చర్యలు చేపట్టాడు. అందరూ కూడా తమ తమ ఇళ్ల బయట, బాల్కనీలో, కిటికీలపై, టెర్రస్లపై పక్షుల కోసం నీళ్లను అందుబాటులో ఉంచాల్సిందిగా కోరాడు.