హైదరాబాద్ : కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన మాదిరిగానే తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎగువ భద్ర ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడాన్ని స్వాగతించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్ ఐదేళ్ళ కిందటే 2016 ఫిబ్రవరి 11న ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.
అప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ నిరంతరంగా కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రులు ఉమా భారతీ, నితిన్ గడ్కరీ, గజేంద్రనాథ్ షేకావత్ లతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు సైతం పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకువస్తున్నట్లు చెప్పారు. కాగా రెండు రోజుల కిందట కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి తుది ఆమోదం కోసం ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి పంపిందని వినోద్ కుమార్ తెలిపారు.
ఎగువ భద్ర ప్రాజెక్టుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలని ఆయన ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు కల్పించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేలా చొరవ చూపాలని పేర్కొన్నారు.