వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో కట్టడికి కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతిపాదన
12 రాష్ర్టాలతో రాజేష్ భూషణ్ భేటీ
46 జిల్లాల నుంచే 71% కేసులు
మహారాష్ట్రలోనే 36 జిల్లాలు
న్యూఢిల్లీ, మార్చి 27: కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో వైరస్ కట్టడికి కేంద్ర ఆరోగ్యశాఖ ఐదంచెల వ్యూహాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం రాష్ర్టాలు.. 1. టెస్టులను భారీగా పెంచాలి. మొత్తం టెస్టుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు కనీసం 70 శాతం ఉండాలి. 2. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రభావవంతంగా నిర్వహించాలి. ఒక్కో పాజిటివ్ కేసుకు కనీసం 30 మంది కాంటాక్టులకు పరీక్షలు నిర్వహిచాలి. 3. హెల్త్కేర్ వర్కర్లకు పునరుత్తేజం కల్పించాలి. దవాఖానలో వసతులు పెంచాలి. 4. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. 5. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలి.
కరోనా రాజధాని మహారాష్ట్ర
దేశవ్యాప్తంగా 46 జిల్లాల నుంచే 71% శాతం కేసులు నమోదు అవుతున్నాయని కేంద్రం తెలిపింది. ఈ 46 జిల్లాల్లో 36 మహారాష్ట్రలోనే ఉన్నాయని పేర్కొన్నది. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న 12 రాష్ర్టాల అడిషనల్ సీఎస్లు, ఆరోగ్యశాఖ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, 46 జిల్లాల కలెక్టర్లతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వీటిలో మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, జమ్ముకశ్మీర్, కర్ణాటక, పంజాబ్, బీహార్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ 46 జిల్లాలకు సంబంధించి సర్వేల వివరాలను అధికారుల ముందుకు తీసుకువచ్చారు. కరోనా గురించి అవగాహన ఉన్నప్పటికీ కేవలం 44 శాతం మందే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరిస్తున్నారని తెలిపారు. ఈ జిల్లాల్లో కనీసం 14 రోజుల పాటు కంటైన్మెంట్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు.
మహారాష్ట్రలో సామూహిక కార్యక్రమాలు నిషేధం
కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం మత, రాజకీయపరమైన సభలు, సమావేశాలతో పాటు అన్ని రకాల సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించింది. రాత్రి 8 నుంచి ఉదయం 7 వరకు అయిదుగురు కంటే ఎక్కువమంది వ్యక్తులు గుమిగూడటానికి లేదని, రెస్టారెంట్లు, గార్డెన్లు, మాల్స్ను రాత్రి 8 నుంచి ఉదయం 7 వరకు మూసివేయాలని ఆదేశించింది. శనివారం నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. రాత్రివేళల్లో ఫుడ్ డెలివరీకి మాత్రం అనుమతి ఇచ్చింది.