న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా కరోనా మళ్లీ విజ్రుంభిస్తున్నది. తాజాగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 42,982 మందికి వైరస్ సోకింది. దీంతో కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 31.8 లక్షల మందికి చేరుకున్నది. మహమ్మారి వల్ల తాజాగా 533 మంది మరణించడంతో మొత్తం మ్రుతుల సంఖ్య 4,26,290 మందికి చేరింది. ఇప్పటివరకు 3.09 కోట్ల మంది కోలుకున్నారు. మరో 4,11,076 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా 48.9 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
తాజా కరోనా కొత్త కేసులతోపాటు ఆర్ వాల్యూ కొన్ని రాష్ట్రాల్లో పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. కానీ ప్రజలు ఆందోళనకు గురి కావద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. శరవేగంగా వైరస్ వ్యాప్తికి ఆర్ విలువ కీలకంగా మారింది. సగటున వైరస్ బారిన పడ్డవారి నుంచి ఎంత మందికి వ్యాపించిందని తెలియజేసేదే ఆర్ విలువ. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్నదని ఇప్పటికిప్పుడు ప్రకటించడం తొందరపాటవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దేశంలో సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని వ్యాఖ్యానించారు.
వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించడంలో లోపంతోపాటు కంటైన్మెంట్ చర్యల లేమి వల్లే కేరళలో తాజాగా కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర నిపుణుల బ్రుందం పేర్కొంది. ప్రతి ఇద్దరికి వైరస్ సోకితే 20 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మొహర్రం, ఓనం, జన్మాష్టమి, గణేశ్ చతుర్థి, దుర్గా పూజ పండుగలు వస్తున్న నేపథ్యంలో స్థానికంగా ప్రజల కదలికలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు కేంద్రం సలహా ఇచ్చింది. పండుగల సందర్భంగా సామూహిక సమీకరణలతో సూపర్ స్ప్రెడర్లు మహమ్మారి వ్యాప్తికి కారణం అవుతారని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) ఆందోళన వ్యక్తం చేశాయి.
ఏప్రిల్, మే నెలల్లో వ్యక్తుల మరణాలపై బీహార్, కర్ణాటకల్లోనే నిర్ధారణ జరిగింది. 2019 ఏప్రిల్-మే తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోనే మరణాల రేటు 1.87 శాతం పెరిగింది. కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో అనూహ్యంగా మరణాల రేటు పెరుగుతున్నది. బీహార్లో 2.03 రెట్లు, కర్ణాటకలో 1.37 రెట్లు మరణాలు సంభవించాయి.