67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ సోమవారం సాయంత్రం వచ్చిన విషయం తెలిసిందే. సామాజిక ఇతివృత్తాలకు జ్యూరీ పెద్దపీట వేయగా, జాతీయ ఉత్తమ జనరంజక చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రం ‘జెర్సీ’ నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాయి. అలానే ఉత్తమ కొరియోగ్రఫీ-రాజు సుందరం (మహర్షి) కూడా జాతీయ అవార్డ్ గెలుచుకున్నారు. అయితే జాతీయ ఫిల్మ్ అవార్డులు గెలుచుకున్నవారిని మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, బాబీ, అడివి శేష్, గోపిచంద్ మలినేని, వెంకీ అట్లూరి, హరీష్ శంకర్, శర్వానంద్ వంటి సెలబ్స్ ప్రశంసించారు.
మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తెలుగు, తమిళం, మలయాళం ఇండస్ట్రీకు సంబంధించి నేషనల్ అవార్డ్ పొందిన విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి సినిమాకు మరింత పవర్ దక్కింది అని పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో..జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ రంగం నుంచి అవార్డులకు ‘మహర్షి’, ‘జెర్సీ’ చిత్రాలు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలిచిన ‘మహర్షి’ చిత్ర నిర్మాత శ్రీ దిల్ రాజు, దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, చిత్ర కథానాయకుడు శ్రీ మహేశ్ బాబుకు అభినందనలు. ఇదే చిత్రం ద్వారా ఉత్తమ నృత్య దర్శకులుగా శ్రీ రాజు సుందరం ఎంపిక కావడం ఆనందకరం. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘జెర్సీ’ నిర్మించిన శ్రీ సూర్యదేవర నాగ వంశీ, దర్శకుడు శ్రీ గౌతమ్ తిన్ననూరి, చిత్ర కథానాయకుడు శ్రీ నాని, ఇదే చిత్రానికి పని చేసిన శ్రీ నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్ అవార్డుకి ఎంపికైనందుకు అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ చిత్రాల దర్శకులు, నిర్మాతలు జాతీయ పురస్కారాలు ఇచ్చిన స్ఫూర్తితో ప్రేక్షకులను మెప్పించే మరిన్ని మంచి చిత్రాలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను..” అని అన్నారు.