రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా వేళ.. అన్నదాతలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో గ్రామస్థాయిలోనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. రంగారెడ్డి జిల్లాలో 35,333 ఎకరాల్లో వరి సాగుకాగా.. 45వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు. అందుకోసం 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 69వేల ఎకరాల్లో సాగవ్వగా.. 1,74,073.80 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 87 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం నుంచి కొనుగోలు కేంద్రా లు ప్రారంభించనుండగా, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వసతుల కల్పనపై దృష్టి సారించారు. కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటుపై సీఎం చొరవకు రైతుల నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.
వికారాబాద్, మార్చి 30, (నమస్తే తెలంగాణ) :యాసంగి పంట చేతికొచ్చే సమయం ఆసన్నమైంది. దీంతో రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వికారాబాద్ జిల్లాలో 1,74,073.80 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. జిల్లావ్యాప్తంగా 87 కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్), ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ), వ్యవసాయ మార్కెట్(ఏఎంసీ)డీసీఎంఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేలా అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కాగా, జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నది.
త్వరలో కలెక్టర్ సమీక్ష..
యాసంగికి వికారాబాద్ జిల్లాలో 69,667 ఎకరాల్లో వరి సాగు చేశారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. నేటి నుంచి కొనుగోళ్లు షురూ కానుండడంతో మార్గదర్శకాలనూ విడుదల చేసింది. ఒకటి, రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ పౌసుమి బసు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
69,667 ఎకరాల్లో సాగు, 1,74,073.80 మెట్రిక్ టన్నుల దిగుబడి..
వికారాబాద్ జిల్లాలో 69,667 ఎకరాల్లో వరి సాగైంది. 1,74,073.80 మెట్రిక్ టన్నుల దిగుబడి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా 11 మండలాల నుంచి అధికంగా ధాన్యం రానున్నది. బొమ్మరాస్పేట, దౌల్తాబాద్, కొడంగల్, కులకచర్ల, దోమ, పరిగి, ధారూర్, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ తదితర మండలాల్లో ఎక్కువగా వరి సాగు చేశారు. ప్రధానంగా లక్ష మెట్రిక్ టన్నుల దిగుబడి రావొచ్చని అంచనా. 18,390.70 మెట్రిక్ టన్నులు మిల్లులకు వెళ్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఏప్రిల్లో 30 వేలు, మే 60 వేలు, జూన్లో 10 వేల మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం మార్కెట్కు రానున్నది. 25 కిలోల బ్యాగులు 25లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, కొత్తవి 2,13,325, పాతవి 11.50లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. 11,63,675 బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు గాను 87 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలో 87 కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలో 87 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఐకేపీ 21, పీఏసీఎస్ 40, డీసీఎంఎస్20, ఏఎంసీ 6 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. టార్పాలిన్లు 1380 అందుబాటులో ఉన్నాయి. 213 వేయింగ్ మిషన్లు అందుబాటులో పెట్టారు. జిల్లాలో 46 రైస్ మిల్లులు ఉన్నాయి. ఐకేపీకి 5,738 మంది, పీఏసీఎస్కు 6,127మంది, డీసీఎంఎస్కు 3,573, ఏఎంసీకి 369 మంది రైతుల చొప్పున మొత్తం 15,807 మంది ధాన్యాన్ని సేకరించనున్నారు.
కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. క్వింటాలుకు మద్దతు ధర రూ.1885 చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో..
కరోనా నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలో ఏయే మండలాల్లో ఎక్కువగా వరి సాగవుతుందన్న వివరాలను అధికారులు సేకరించగా, అందుకు తగినట్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఒకేరోజు రైతులందరూ ధాన్యాన్ని తీసుకురాకుండా రోజుకు 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించేలా నిర్ణయించారు. గ్రామాల వారీగా ఏఈవోలు రైతులకు టోకెన్లను జారీ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 35,333 ఎకరాల్లో వరి సాగు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద సబ్బు, శానిటైజర్ను ఉంచనున్నారు. భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ధాన్యం డబ్బులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వారం, పది రోజుల్లో ప్రభుత్వం జమ చేయనున్నది.
30 ధాన్యం కొనుగోలు కేంద్రాలు…
జిల్లాలో 30 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు యాసంగి సీజన్కుగాను 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న గ్రామాల్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ సూచనల ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుంది. ఒకేరోజు రైతులందరూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురాకుం డా జాగ్రత్తలు తీసుకోనున్నారు. రోజుకు 50 మంది రైతుల నుంచి 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించే విధంగా అధికారులు నిర్ణయించారు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1835లు, సాధారణ గ్రేడ్ క్వింటాలుకు రూ.1815 కనీస మద్దతు ధర చెల్లించనున్నారు. జిల్లావ్యాప్తంగా 35,333 ఎకరాల్లో వరి సాగు చేశారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు: జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్యామారాణి
జిల్లావ్యాప్తంగా ధాన్యాన్ని విక్రయించే రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్యామారాణి తెలిపారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ రైతుకు కనీస మద్దతు ధర అందేలా చూస్తామన్నారు. కరోనా దృష్ట్యా ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద నీటితోపాటు సబ్బు, శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యాన్ని తీసుకువచ్చే రైతులు భౌతిక దూరం పాటించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి..
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. రైతుల ఇబ్బందులను తెలుసుకుని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం హర్షణీయం. కరోనా నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతారని గ్రామాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయడం అభినందనీయం.
-పాండు యాదవ్, రైతు (కడ్తాల్ మండలం)
రవాణా ఖర్చులు తప్పాయి..
గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో మార్కెట్కు వెళ్లకుండా రవాణా ఖర్చులు తప్పాయి. రైతుల కోసం తీసుకున్న నిర్ణయం చాలా బాగున్నది. సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు. రైతుల కోసం ఎంతో కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు.
రైతులకు భారం తగ్గుతుంది..
గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల కల్లాల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లే పని భారం తగ్గుతుంది. ట్రాక్టర్ కిరాయి మిగులడంతోపాటు శ్రమ తగ్గుతుండడం చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
ఇవీ కూడా చదవండి..
పెట్టిన పెట్టుబడికి భారీ లాభాలంటూ ఆశచూపారు
నగ్నంగా చాటింగ్.. ఆపై బ్లాక్మెయిల్