దేశంలోని పలు ప్రాంతాలకు చేరవేసిన రైల్వే
బాధితుల కోసం 3,816 కొవిడ్ కేర్ కోచ్లు సిద్ధం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు అవసరమైన 150 టన్నుల ఆక్సిజన్ను 24 గంటల్లోనే చేరవేశామని రైల్వే శనివారం ప్రకటించింది. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంవో)తో విశాఖపట్నంనుంచి మహారాష్ట్రలోని నాసిక్, ఉత్తరప్రదేశ్లోని లక్నో, వారణాసికి తరలించారు. ప్రస్తుతం మూడో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ శనివారం లక్నోనుంచి రాత్రి బయలుదేరనున్నది. ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా 3,816 కోచ్లను కొవిడ్ బాధితుల కోసం సిద్ధంగా ఉంచామని రైల్వే అధికారులు ప్రకటించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల మేరకు బోగీలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే 21 కొవిడ్ కేర్ కోచ్లను మహారాష్ట్రలో ఏర్పాటుచేశామని, వాటిలో 47 మందికి చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఆనంద్విహార్, వారణాసి, ఫజియాబాద్ వంటి ప్రాంతా ల్లో మొత్తం 50 కొవిడ్ కేర్కోచ్లు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.