గన్నేరువరం, ఏప్రిల్ 7: ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాలు తగ్గి, ప్రజలు సురక్షితంగా ఉంటారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం ఆయన సీపీ కమలాసన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన ఎస్ఐ ఆవుల తిరుపతిని ఎమ్మెల్యే అభినందించారు. ఆధునిక హంగులతో స్టేషన్, పోలీస్ క్వార్టర్స్ నిర్మిస్తామని తెలిపారు.
గుండ్లపల్లి రాజీవ్ రహదారి నుంచి మండల కేంద్రం మీదుగా పొత్తూరు, వెంకట్రావుపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈనెల 19న మాదాపూర్లో రైతు వేదిక ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వస్తారని, డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతామని తెలిపారు. సీపీ కమలాసన్రెడ్డి మాట్లాడుతూ, సీసీ కెమెరాల ఏర్పాటులో గన్నేరువరం మండలం ముందంజలో ఉన్నట్లు తెలిపారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని మరో 11 మండలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల మన్ననలు పొందుతున్న ఎస్ఐ ఆవుల తిరుపతిని అభినందించారు. ఈ సందర్భంగా సీపీ కమలాసన్రెడ్డి, పోలీసులు ఎమ్మెల్యే, సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రసమయి సీపీ కమలాసన్రెడ్డి, ఏసీపీ విజయసారథి, సీఐ శశిధర్రెడ్డి, ఎస్ఐ ఆవుల తిరుపతిని శాలువాలతో సన్మానించారు.
క్రీడలతో మానసికోల్లాసం
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పిచ్ను ఆయన సీపీ కమలాసన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ కమలాసన్రెడ్డి బౌలింగ్ చేయగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బ్యాటింగ్ చేశారు. ఇద్దరు క్రికెట్ ఆడి సందడి చేశారు. కాగా, పిచ్ ఏర్పాటుకు కృషి చేసిన టీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేశ్ను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అభినందించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న, సర్పంచ్ పుల్లెల లక్ష్మి, సర్పంచుల, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు తీగల మోహన్రెడ్డి, గూడెల్లి ఆంజనేయులు, నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, గంప వెంకన్న, ఏలేటి చంద్రారెడ్డి, లింగాల మహేందర్రెడ్డి, బోడ మాధవరెడ్డి, పుల్లెల సాయి, బొడ్డు సునీల్ తదితరులు పాల్గొన్నారు.