ముంబై: మహారాష్ట్రలో సిక్కులు వీరంగం సృష్టించారు. నాందేడ్లోని ఓ గురుద్వారా వద్ద .. పోలీసులపై తిరగబడ్డారు. తల్వార్లు పట్టుకున్న సిక్కులు ఆవేశంతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో మతపరమైన ఊరేగింపు ఏదీ నిర్వహించరాదు అని పోలీసులు ఆ సిక్కులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిక్కులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. గురుద్వారా కాంప్లెక్స్ వద్ద కత్తులతో దూసుకువస్తున్న సిక్కుల వీడియో ఒకటి వైరల్ అయ్యింది. బారికేడ్లను తొలగించి వారంతా.. పోలీసులపై అటాక్ చేశారు. ఈ ఘటనలో పోలీసుల కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. వైరస్ ఆంక్షల వల్ల హోలా మొహల్లా ఊరేగింపునకు అనుమతి ఇవ్వలేదని ఎస్పీ ప్రమోద్ కుమార్ షెవాలే తెలిపారు. మోలా మొహల్లాపై నిషేధం ఉన్నా.. కొందరు యువ సిక్కులు ఊరేగింపు నిర్వహించేందుకు తెగించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు అధిక స్థాయిలో వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. పోలీసులపై దాడికి తెగించిన ఘటనలో నాందేడ్ పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. అల్లర్లు, హత్యాయత్నం కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.