అహ్మదాబాద్ : ప్రత్యర్ధి వర్గానికి చెందిన వారితో మాట్లాడిందనే ఆగ్రహంతో గిరిజన మహిళను ఆమె ఇంటి ఎదుట నడిరోడ్డుపైనే దారుణంగా హింసించిన ఘటన గుజరాత్లో కలకలం రేపింది. దహోద్ జిల్లాలో జరిగిన ఈ ఘోర ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ వీడియోను చూసిన అనంతరం సోమవారం సాయంత్రం బాధిత మహిళను మకి మఖ్లా వల్వాయ్గా గుర్తించారు.
ప్రత్యర్ధి కుటుంబానికి చెందిన మహిళను పలకరించినందుకు తనను భర్త బంధువులు దారుణంగా కొట్టారని బాధిత మహిళ పోలీసులకు వివరించారు. మహిళను ఆమె ఇంటి ఎదుట రోడ్డు మీద ఈడ్చుకుంటూ నిందితులు తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. నలుగురు నిందితులు కర్రలతో తమ ఇంట్లోకి చొచ్చుకువచ్చి దాడికి తెగబడ్డారని బాధితురాలు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.