బెంగళూరు: కర్ణాటకలో డెల్టా వేరియంట్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతున్నది. నమూనాలు పరీక్షించిన వాటిలో ఇప్పటి వరకు 725 డెల్టా వేరియంట్ కేసులు, రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 525, విజయపురాలో 77, ఉడిపిలో 40 డెల్టా వేరియంట్ కరోనా కేసులు బయటపడ్డాయి. జూన్ 23న డెల్టా ప్లస్ రెండో కేసును గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. డెల్టా వేరియంట్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్పై మరోసారి దృష్టిసారించింది. మొత్తం నమూనాల్లో ఐదు శాతం మేర ర్యాండమ్ పద్ధతిలో డెల్టా వేరియంట్ కోసం చెక్ చేస్తున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. రాష్ట్రంలోని ఆరు ల్యాబ్స్లో కరోనా కొత్త వేరియంట్ల జన్యువు క్రమ అమరికను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.