లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో రైతుల మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న మౌనవ్రతం పాటించాలని కాంగ్రెస్ నాయకత్వం పార్టీ రాష్ట్ర శాఖల చీఫ్లను కోరింది. అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా ఈ ఘటనలో దోషులందరినీ అరెస్ట్ చేయాలని కూడా పార్టీ చీఫ్లు డిమాండ్ చేయనున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ చీఫ్లు సోమవారం ఉదయం పది గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకూ రాజ్భవన్ వెలుపల లేదా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద మౌన వ్రతం పాటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు అజయ్ మిశ్రాపై వేటు వేయడంతో పాటు ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు నిలువరించారు. లఖింపూర్ ఖేరిలో ఆదివారం ఆందోళనలు చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు చెందినదిగా భావిస్తున్న ఎస్యూవీ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.