న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై సోమవారం మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రకటనలను కాంగ్రెస్ నేతలే ఎగతాళి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గ్రామస్తులు, పేదలు, రైతులు పడిన బాధ గురించి ఆయనకు ఎలాంటి అనుభవం లేదన్నారు. రాజకీయంగా నిలదొక్కుకునేందుకు రాహుల్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రోజుకొక అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నారని విమర్శించారు.
వ్యవసాయ చట్టాలను తీసుకొస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రస్తుతం చేస్తున్న ప్రకటనలపై పునరాలోచించాలని తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాల గురించి అప్పుడు అబద్ధాలు చెప్పారా లేదా ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారా అన్నదానిపై వారు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులను తప్పుదోవ పట్టించడానికి లేదా అరాచక వాతావరణాన్ని సృష్టించడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించకూడదని తోమర్ సూచించారు.
కాగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఎనిమిది నెలలుగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ సోమవారం ట్రాక్టర్ను నడుపుతూ పార్లమెంట్ సమావేశాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ మేరకు మండిపడ్డారు.