యాదాద్రి భువనగిరి : ప్రజలకు మానసిక ఆరోగ్య సేవలను అందించేందుకు అదేవిధంగా వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి బీబీనగర్ ఎయిమ్స్లోని కమ్యూనిటీ మెడిసిన్ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం శనివారం తన ప్రాంగణంలో హెల్త్ అండ్ హ్యాపీనెస్ క్లినిక్ను ప్రారంభించింది. క్లినిక్ ప్రారంభం అనంతరం ఎంపీ డాక్టర్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. హెల్త్ అండ్ హ్యాపీనెస్ క్లినిక్ ఏర్పాటు చేయడంపై ఎయిమ్స్ ను ఆయన ప్రశంసించారు. ప్రస్తుత కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల్లో ప్రజల్లో ఆందోళన, నిరాశ పెరిగిందన్నారు. మహమ్మారి వల్ల కలిగే ఆందోళన నుండి ఉపశమనం పొందడానికి ప్రజలకు ఈ క్లినిక్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఎయిమ్స్ ఈడీ డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ.. హెల్త్ అండ్ హ్యాపినెస్ క్లినిక్ ధ్యానం, యోగా సేవలు, మైండ్ఫుల్నెస్, రిఫరల్స్, వ్యక్తి లేదా కుటుంబం మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్, కన్సల్టింగ్ వంటి సమగ్ర సేవలను అందిస్తుందన్నారు. ఆత్మహత్య నివారణకు గాను సేవలు అందించేందుకు 24 గంటల హెల్ప్లైన్తో పాటు మ్యూజిక్ థెరపీ, సానుకూల మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, ఆందోళన, నిరాశకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆందోళన, నిరాశను ఎదుర్కొంటే కౌన్సిలింగ్ తీసుకునేందుకు ప్రజలు వెనుకాడవద్దన్నారు. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు జూన్ 21 న ఎయిమ్స్ ప్రాంగణంలో కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.