భోపాల్ : మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్ ఓ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో కాల్ చేసిన ఆ మహిళ.. తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో ఎమ్మెల్యే నీరజ్ ఆరోపించారు. ఆ మహిళ తనకు తెలియదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఆ మహిళ.. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న వీడియో క్లిప్లతో బ్లాక్మెయిల్ చేస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. చతార్పూర్లోని మహారాజ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నీరజ్ దీక్షిత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేసినట్లు డీఎస్పీ శశాంక్ జైన్ తెలిపారు. గర్హి మలేహరా పోలీసు స్టేషన్లో ఎమ్మెల్యే తన ఫిర్యాదును రిజిస్టర్ చేశారు. ఆ మహిళకు చెందిన నెంబర్ నుంచి కూడా గతంలో ఎస్ఎంఎస్లు వచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు. వీడియో కాల్ క్లిప్తో బెదిరించిన మహిళ ఎంత డిమాండ్ చేసిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులతో ఎమ్మెల్యే ఉన్నప్పుడు.. ఆయనకు ఆ వీడియోకాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించగానే.. ఎమ్మెల్యే ఆ కాల్ను కట్ చేసినట్లు చెప్పారు.