నాగర్కర్నూల్/కొల్లాపూర్ రూరల్, జూన్ 14: అదనపు జూనియర్ సివిల్ కోర్టులు ప్రారంభించుకోవడం ద్వారా ప్రజలకు, న్యాయవాదులకు వ్యయప్రయాసాలు తగ్గనున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి అన్నారు. ఇప్పటివరకు కేసుల విచారణ కోసం నాగర్కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతవాసులు మహబూబ్నగర్, హైదరాబాద్కు వెళ్లాల్సివచ్చేదని.. ఇక ఆ కష్టాలు తీరనున్నాయని చెప్పారు. సోమవా రం హైదరాబాద్ నుంచి వర్చువల్ మీటింగ్ ద్వారా నాగర్కర్నూల్లో 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టును, కొల్లాపూర్లో మొదటి, రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టులను ఆమె ప్రారంభించారు. అనంతరం ప్రత్యక్షంగా నాగర్కర్నూల్లో మహబూబ్నగర్ కోర్టు జడ్జి ప్రేమావతి, కొల్లాపూర్లో మహబూబ్నగర్ జిల్లా మొదటి అదనపు జడ్జి రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ హిమాకోహ్లి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడే కోర్టులు కేసుల సత్వర విచారణకు దోహదపడుతాయన్నారు. బార్ అసోసియేషన్, న్యాయవాదులు సమన్వయంతో పనిచేసి కేసులను సత్వర విచారణ చేసి ప్రజలకు న్యాయం చేకూర్చాలని కోరారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్రెడ్డి మాట్లాడుతూ.. నాగర్కర్నూల్ జిల్లాలో ఒకేరోజు మూడు అదనపు జూనియర్ సివిల్ కోర్టులు ప్రారంభించుకోవడంపై శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాలుగో అదనపు సెషన్స్ జడ్జి రవికుమార్, సీనియర్ సివిల్ జడ్జి శీతల్, మొబైల్కోర్టు మెజిస్ట్రేట్ మురళిమోహన్, జూనియర్ సివిల్ జడ్జి స్వరూప, నాగర్కర్నూల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్రావు, ఎస్పీ డాక్టర్ సాయిశేఖర్, న్యాయవాదులు పాల్గొన్నారు.