చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదల్ పార్టీ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ చెప్పారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే విషయం వారికి ఇప్పటికే అర్థమయ్యిందని ఆమె వ్యాఖ్యానించారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ తన ఆయుధాలను కింద పడేసుకున్నదని, వాళ్లు ఇప్పటికే ఓటమిని అంగీకరించారని కౌర్ ఎద్దేవా చేశారు.
ప్రజాసంక్షేమ పాలన అందించడంలో అమరీందర్ సింగ్ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇప్పుడు పంజాబ్ ప్రజానీకం అంతా వీధుల్లో పడాల్సిన పరిస్థితి వచ్చిందని హర్సిమ్రత్ కౌర్ మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. మాదకద్రవ్యాల అమ్మకం కూడా విచ్చలవిడిగా కొనసాగుతున్నదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఇవేవీ పట్టడంలేదని, పాలకులు తమ పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని హర్సిమ్రత్ విమర్శించారు.