న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ కట్టడికి భారీగా వెచ్చించాల్సి రావడంతో చత్తీస్గఢ్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. నయా రాయ్ పూర్ లో నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ భవనం, సీఎం నివాసం, నూతన అసెంబ్లీ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
కరోనా మహమ్మారి నియంత్రణకు ఖర్చులు పెరగడంతో రాజధాని నిర్మాణ పనులను ఆపాలని చత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాగేల్ ఆదేశించారని అధికారులు వెల్లడించారు. కొవిడ్-19 పరిస్థితుల కారణంగా చత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిపివేయడంతో పాటు రాష్ట్ర అసెంబ్లీ నిర్మాణ పనుల టెండర్లను రద్దు చేసిందని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిలిపివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిన నేపథ్యంలో చత్తీస్గఢ్ లో పాలక కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.