కరోనా కష్టాలపై హనుమ విహారి
వలంటీర్లతో సహాయక చర్యల్లో భారత ప్లేయర్
బ్రిటన్ పర్యటనలో ఉన్నా స్వదేశానికి సేవ
నిప్పుల్లాంటి బంతులకు.. తీవ్రమైన గాయాలకు ఎదురొడ్డి టీమ్ఇండియా కోసం ఎన్నోసార్లు వీరోచితంగా పోరాడిన హనుమ విహారి కరోనాపై యుద్ధానికి సైన్యంతో సిద్ధమయ్యాడు. ప్రమాదకర వైరస్ బారిన పడిన ఎంతో మందికి సాయం చేస్తున్నాడు. ప్రస్తుతం కౌంటీ సీజన్ ఆడుతూ బ్రిటన్లో ఉన్నా.. వలంటీర్ల సాయంతో భారత్లో కరోనా బాధితులకు ఈ తెలుగు క్రికెటర్ చేయూతనందిస్తున్నాడు. వైరస్ బారిన పడిన వారికి తన సన్నిహితుల సాయంతో దవాఖానల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాస్మా ఏర్పాట్లతో పాటు మరిన్ని వైద్య సేవలు అందేలా చేస్తున్నాడు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం ఇంత కష్టమవుతుందని కలలో కూడా ఊహించలేదంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విహారి మనోగతం అతడి మాటల్లోనే..
న్యూఢిల్లీ: కరోనా రెండోవేవ్ తీవ్రంగా విజృంభిస్తున్నది. వైరస్ బాధితులకు దవాఖానల్లో పడకలు దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. అందుకే నా ఫాలోవర్లను వలంటీర్లుగా ఎంపిక చేసి వీలైనంత మందికి సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఆస్పత్రుల్లో బెడ్లు, వైద్యం, మందులు కొనలేక ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయాలనేదే మా ధ్యేయం. అయితే ఇది సరిపోదు. భవిష్యత్తులో మరింత సేవ చేయాలని అనుకుంటున్నా.
జట్టు కోసం ఏమైనా చేస్తా
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ సహా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ గురించి హనుమ విహారి మాట్లాడాడు. జట్టు కోరితే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు దిగడానికి సిద్ధమేనని చెప్పాడు. జట్టు ఏం కోరితే నేను అది చేస్తా. నా కెరీర్లో చాలా కాలం టాపార్డర్లో బ్యాటింగ్ చేశా. ఆ సవాల్కు నేను సరిగ్గా సరిపోతా అని విహారి చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లిష్ కౌంటీల్లో వార్విక్షైర్ తరఫున విహారి ఇంగ్లండ్ గడ్డపై ఆడుతున్నాడు. కాగా కౌంటీల అనుభవం డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో సిరీస్లో తనకు ఎంతో ఉపయోగపడుతుందని విహారి చెప్పాడు. వాతావరణ పరిస్థితులతో పాటు ఇంగ్లిష్ పిచ్లకు అలవాటు పడతానని చెప్పాడు.
100 మందితో జట్టు.. వాట్సాప్ గ్రూప్
ప్రస్తుతం వంద మంది వలంటీర్లను ఎంపిక చేసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. నా జట్టును స్వయంగా ఎంచుకున్నా. వారు ఎంతో కష్టపడి వీలైనంత మందికి చేయూతనందిస్తున్నారు. ఈ స్ఫూర్తితో మరింత మంది ముం దుకు రావాలని కోరుకుంటున్నా. వలంటీర్లు అవిశ్రాంతంగా పని చేస్తున్నందునే ఇది సాధ్యమవుతున్నది.
ఒక్కడిగా ప్రారంభించా..
కరోనా బాధితులకు సాయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఒక్కడిగా ప్రారంభించా. ఇప్పుడు ఇంత మందిని భాగస్వాములను చేశా. సోషల్ మీడియాలోని విభిన్న ప్లాట్ఫామ్ల్లో కొందరు స్నేహితులను, ఫాలోవర్లను ఏకం చేశా. సోషల్ మీడియాలో బాధితులు సాయం కోరినా మా వలంటీర్లు సాయం చేస్తున్నారు. నా భార్య, సోదరితో పాటు ఆంధ్ర జట్టులోని కొందరు ఆటగాళ్లు కూడా వలంటీర్లుగా పని చేస్తున్నారు.
మూడు రాష్ర్టాల్లో..
విహారి దిశానిర్దేశంలోని వలంటీర్లు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో పని చేస్తున్నారు. వీలైనంత మంది కరోనా బాధితులకు దవాఖానల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్యం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా మంది క్రికెటర్లు ఆర్థిక సాయం, వైద్య పరికరాలు విరాళంగా ఇస్తుండగా.. విహారి స్వయంగా వలంటీర్లను ఏర్పాటు చేసి నేరుగా బాధితులకు సేవలు అందేలా చేస్తున్నాడు. బ్రిటన్ పర్యనటలో ఉంటూ తన దేశంలో ఇబ్బందులు పడుతున్న వారి కోసం కృషి చేస్తున్న విహారిపై ప్రశంసలు కురుస్తున్నాయి.