హైదరాబాద్ : బాధితురాలి నగ్న ఫొటోలను తొలిగించాలని లేఖలు రాసినా ఎందుకు డిలీట్చేయలేదని సామాజిక మాధ్యమ సంస్థలను హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్లకు సోమవారం నోటీసులు జారీచేసింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడిన తన కుమార్తెను ప్రేమికుడు బ్లాక్మెయిల్ చేసి నగ్న ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడని, తమ ఫిర్యాదు ఆధారంగా సోషల్ మీడియా, ఇంటర్నెట్ నుంచి ఆ ఫొటోలను తొలిగించారని బాధితురాలు తెలిపింది. తన కూతురుకు ఇప్పుడు 32 ఏండ్లని, భర్త, ఐదేండ్ల కొడుకుతో ఆస్ట్రేలియాలో స్థిరపడి సంతోషంగా ఉన్నదని, ఆ నేపథ్యంలో ఆ ఫొటోలు 2019లో మళ్లీ కనిపించాయని, వీటిని తొలిగించాలని సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని, పైగా ఫొటోలను తాము సోషల్మీడియాలో పెట్టలేదని చెప్తున్నాయని బాధితురాలి తల్లి హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంటున్న తల్లి దాఖలు చేసిన రిట్ పిటిషన్లోని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ ఫిర్యాదు ఏ దశలో ఉందో చెప్పాలని సైబర్ క్రైం పోలీసులను న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం ఆదేశించారు. మాజీ ప్రియుడు చేసిన మోసం వల్ల ఒక గృహిణి వ్యక్తిగత చిత్రాల గోప్యతకు ఎలాంటి చర్యలు తీసుకున్నదీ చెప్పాలని పేర్కొన్నారు. నేరుగా బాధితురాలే లేఖ రాసినా ఎందుకు స్పందించలేదో కూడా వివరణ ఇవ్వాలన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు పిటిషనర్ వినతిపత్రం సమర్పించాలని సూచించారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు.