న్యూఢిల్లీ: నిబంధనలు ఉల్లంఘించామంటూ ట్విటర్ తమ అధికారిక అకౌంట్ను బ్లాక్ చేసిందని కాంగ్రెస్ ( Congress ) ఆరోపించింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతల అకౌంట్లను ట్విటర్ ( Twitter ) లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఒత్తిడి వల్లే ట్విటర్ ఇలా చేస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ అయిన INCIndiaను ప్రస్తుతం చూడగలుగుతున్నా.. కొత్త ట్వీట్లను మాత్రం పోస్ట్ చేయలేకపోతోంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వేల మంది మా లీడర్లు, కార్యకర్తల అకౌంట్లను ట్విటర్ బ్లాక్ చేసింది. ఇలా చేయడం ద్వారా ట్విటర్ లేదా ప్రభుత్వం మాపై ఒత్తిడి తీసుకురాలేరు అని ఏఐసీసీ సోషల్ మీడియా హెడ్ రోహన్ గుప్తా అన్నారు. అంతకుముందు పార్టీ నేతలైన రణ్దీప్ సింగ్ సూర్జేవాలా, మాణికం ఠాగూర్, సుష్మితా దేవ్, జితేంద్ర సింగ్ అల్వార్ల ట్విటర్ అకౌంట్లను బ్లాక్ చేసినట్లు కాంగ్రెస్ చెప్పింది.