న్యూఢిల్లీ : తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే కాషాయ పార్టీ నకిలీ టూల్ కిట్ ను ముందుకు తెస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కొవిడ్-19 వ్యాప్తితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం చేయాల్సిన సమయంలో బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టింది.
ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ నూతన కరోనా స్ట్రెయిన్ ను మోదీ స్ట్రెయిన్, ఇండియా స్ట్రెయిన్ గా పిలుస్తోందని బీజేపీ నేత సంబిట్ పాత్ర చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నకిలీ టూల్ కిట్ కు సంబంధించి ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ నేత సంబిట్ పాత్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కాంగ్రెస్ రీసెర్చి విభాగం అధిపతి రాజీవ్ గౌడ మంగళవారం ట్వీట్ చేశారు.