గువాహటి: అసోంలో ఆపరేషన్ కమల్కు తమ పార్టీ అభ్యర్థులు చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే తమ అభ్యర్థులను హోటళ్లకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం అసోంలోని హోటళ్లను ముందుగానే బుక్చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా గువాహటిలోని ఓ హోటళ్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అభ్యర్థులతో రహస్య సమావేశం నిర్వహించారని సమాచారం. బహిరంగ ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా ఈనెల 22న వారిని గువాహటి, తేజ్పూర్, కజిరంగాకు తరలించనున్నారని తెలుస్తున్నది.
కాగా, పార్టీ సీనియర్ నేత జితేంద్ర సింగ్ ఈ వార్తలను కొట్టిపాడేశారు. ఎన్నికల్లో తమ కూటమి భారీ మెజారిటీ సాధిస్తుందని స్పష్టం చేశారు. తమ అభ్యర్థులు ఎక్కడికీ వెళ్లడంలేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించామని తెలిపారు.
అయితే ప్రలోభాల భయంతో కాంగ్రెస్ కూటమిలోని బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) ఇప్పటికే తమ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించారు. అసోంలో మూడువిడుతల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 వరకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చే నెల 2న వెలువడనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..