న్యూఢిల్లీ: ప్రస్తుతం రెండు కొత్త ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని, కొత్త పార్లమెంట్ బిల్డింగ్తో పాటు సెంట్రల్ విస్టా పనులు జరుగుతున్నాయని ఇవాళ కేంద్ర గృహ నిర్మాణ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. మహమ్మారి కరోనా వ్యాధి రాకముందే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 1300 కోట్లు ఖర్చు కానున్నట్లు మంత్రి తెలిపారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు గురించి తప్పుడు ప్రచారం సాగుతోందని, చారిత్రక-సాంస్కృతిక బిల్డింగ్లను తాము ఏమీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నివాసం(పీఎంఆర్) నిర్మాణ పనులు ఆగస్టులో మొదలుకానున్నట్లు ఓ ప్రధాన పత్రికలో వచ్చిన కథనాన్ని మంత్రి కొట్టిపారేశారు. ఆ రిపోర్ట్ ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పీఎం రెసిడెన్స్ డిజైన్కు సంబంధించిన తుది నమోనా తమ మంత్రిత్వశాఖకు అందలేదని మంత్రి హరిదీప్ తన ట్విట్టర్లో వెల్లడించారు. నిర్మాణ పనులు మొదలు కాకముందే.. డిజైన్ను ఫైనలైజ్ చేయాలని, దానికి అనుమతి ఇచ్చిన తర్వాతే.. టెండర్ల ద్వారా పనులు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. సుమారు 15 ఎకరాల్లో పీఎంఆర్ను నిర్మిస్తున్నట్లు ఓ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. పీఎంఆర్లో ప్రధాని నివాసంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఉంటుంది.
ముఖ్యమైన ప్రాజెక్టు..
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం ఢిల్లీ హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కార్మికులు ఇప్పటికీ నిర్మాణ ప్రదేశంలోనే ఉంటూ పనులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పనులను ఆపే ప్రశ్నే తలెత్తదని కోర్టు చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ పనులు నిలిపివేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే కోర్టు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ తప్ప పిల్ కాదని అనడం గమనార్హం. అంతేకాదు పిటిషనర్లకు రూ.లక్షల జరిమానా కూడా విధించింది. సంబంధిత డీడీఎంఏ ఆదేశాల గురించి కోర్టు ప్రస్తావిస్తూ.. పనులు నిషేధించాల్సిందిగా అందులో ఎక్కడా లేదని కోర్టు స్పష్టం చేసింది.