న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కరోనా పాజిటివ్ వచ్చిన 30 రోజుల్లో ఆత్మహత్య చేసుకొన్నవారి కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారిని కూడా కరోనా మృతులుగానే గుర్తిస్తామని పేర్కొన్నది. గతంలో డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసినప్పుడు ఆత్మహత్య చేసుకొన్నవారిని కరోనా మృతులుగా గుర్తించలేమని కేంద్రం పేర్కొన్నది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ విషయంలో పునరాలోచన చేయాలని సూచించింది.
పరిహారం ఇస్తామన్నారు.. సంతోషకరం: సుప్రీంకోర్టు
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామంటూ కేంద్రప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తం చేసింది. ‘బాధిత కుటుంబాలకు ఇది ఓదార్పునిస్తుంది. వారి కన్నీటిని తుడిచే చర్య చేపట్టడం మాకు సంతోషంగా ఉంది’ అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరిహారంపై పలు మార్గదర్శకాలతో వచ్చే నెల 4న ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.