సిద్దిపేట : నిత్యం బిజీగా ఉండే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు రైతు అవతారం ఎత్తారు. పొలంలోకి తానే స్వయంగా దిగి వరి విత్తనాలను వెదజల్లారు. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే రైతన్నకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ అరుదైన ఘట్టానికి ఆదివారం జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామం వేదికైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2-3 బస్తాలు (1-2 క్వింటాళ్లు) దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా బురదలో కాలు పెట్టకుండానే వరి పంట నాటుకోవచ్చని తెలిపారు. నారు పోసే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్ వస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపొడ్లు సరిపోతాయన్నారు.
వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చునని తెలిపారు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్ని రోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిదని సూచించారు. కాళేశ్వరం సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులు, సిద్దిపేట జిల్లాలో సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్ధతిని అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసే అంశంపై జిల్లా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి ఆదేశిచారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు
భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
పురుగుల మందు తాగి ఆర్ఎంపీ డాక్టర్ మృతి
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
మరియమ్మ కుమారుడికి డీజీపీ పరామర్శ