చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
హన్మకొండ, మే19 : ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యులతో సమానంగా సేవలందిస్తున్న మెడికల్ షాపుల యజమానులపై అధికారులు ఒత్తిడి తీసుకురావొద్దని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన హన్మకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులు, డ్రగ్ అండ్ కెమిస్ట్ వరంగల్ అసోసియేషన్ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలు ఫణంగా పెట్టి మెడికల్ షాపుల యజమానులు మందులు అందిస్తున్నారని, కొందరు అధికారులు వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వైద్యులతో సమానంగా పనిచేస్తున్న వారిని ఇబ్బందిపెట్టొద్దని అధికారులను హెచ్చరించారు. జిల్లాలోని ఏ మెడికల్ షాపులో కూడా అధిక ధరలకు మందులు విక్రయించకుండా పర్యవేక్షించాలని డ్రగ్ అండ్ కెమిస్ట్ వరంగల్ అసోసియేషన్కు సూచించారు. ప్రజల కోసం పనిచేసే వారికి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అండగా ఉంటారని అన్నారు.