హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఒక మొక్కకు నీరు పోస్తే అది వృక్షమై ఎందరికో ప్రాణం పోస్తుందని రాజ్యసభసభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. పౌరులంతా కలిసికట్టుగా ఆయా ప్రాంతాలలో మొక్కలను నాటి భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన ఆగత్యం రాకుండా జాగ్రత్తపడాలని కోరారు. యాభై ఏండ్ల నాటి ‘ట్రీ ఆఫ్ యూనిటీ’ పేరిట ఫిల్మ్స్ డివిజన్ రూపొందించిన షార్ట్ఫిల్మ్ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆయన.. భూమిని చీల్చుకొని వచ్చిన మొక్కకు నీరు పోసి దాన్ని మహావృక్షంగా ఎదగడానికి పర్యావరణ పరిరక్షకులు సమిష్టిగా చేసిన కృషిని షార్ట్ఫిల్మ్లో కండ్లకు కట్టినట్టుగా చూపిన తీరును ఆయన ప్రస్తావించారు. ఒక వృక్షం ఎందరికో సేదదీరడానికి నీడనిస్తూ, పక్షులకు గూడునిస్తూ, ఆకలి తీర్చడానికి ఫలాన్నిస్తూ అనేకవిధాలుగా ఉపకరిస్తున్నదనే విషయం ప్రతీ పౌరుడు గుర్తెరగాలని సంతోష్ సూచించారు. ఆ యానిమేటెడ్ ఫిల్మ్ హృదయాన్ని తాకేలా ఉన్నదని, దాన్ని ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. మరోవైపు గొడ్డలివేటుకు గాయపడ్డ చెట్టును రక్షించటానికి చిన్నపిల్లవాడు చేస్తున్న ప్రయత్నాన్ని వివరిస్తూ వేసిన ఒక కార్టూన్ను గ్రీన్ ఇండియా చాలెంజ్లో పోస్ట్ చేయటం ఆలోచనలో పడవేస్తున్నది. నన్ను రక్షిస్తే మీకు స్వచ్ఛమైన గాలినిస్తా, భవిష్యత్లో మీ పిల్లలకు ప్రాణవాయువును అందిస్తానంటూ ఆ చెట్టు చెప్తున్న తీరును కార్టూన్లో చక్కగా వివరించారు.