వాడీవేడిగా రామగుండం బల్దియా సమావేశం
అభివృద్ధితో మరో రెండేళ్లలో రెట్టింపు జనాభా
అందుకు దీటుగా ఉపాధి అవకాశాలు: మేయర్ డాక్టర్ అనిల్కుమార్
కోల్సిటీ, మార్చి 30: రామగుండం నగర పాలక సంస్థలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.246.25 కోట్ల అంచనా బడ్జెట్కు సభ్యుల నుంచి ఆమోదం లభించింది. నగర పాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. అంచనా ఆదాయం బడ్జెట్ మొత్తం రూ.246 కోట్ల 25 లక్షల 46వేలు కాగా, వ్యయం రూ.230 కోట్ల 58లక్షల 77 వేలుగా, మిగులు బడ్జెట్ రూ.15 కోట్ల 66 లక్షల 69వేలుగా అంచనాలను ప్రవేశపెట్టగా, మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశం ప్రారంభంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు పలు అభివృద్ధి పనుల విషయమై పోడియం వద్ద నిరసన తెలుపగా, మేయర్ డాక్టర్ అనిల్కుమార్, కమిషనర్ ఉదయ్కుమార్ జోక్యం చేసుకొని పట్టణ ప్రగతి నుంచి అభివృద్ధి పనులు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మేయర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, కాలువలు, వీధి దీపాలు అందుబాటులోకి తేవడం కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని కార్పొరేషన్కు నిధులు కేటాయిస్తున్నారన్నారు.
వారికి పాలకవర్గ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ మొదలైన దృష్ట్యా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. గడిచిన నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న సీఎంఏ ప్లాన్ గ్రాంట్ పనులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి ఏడాదిలో దాదాపుగా పూర్తి చేయించగలిగామన్నారు. సుమారు రూ.5వేల కోట్లతో ఆర్ఎఫ్సీఎల్ పునఃప్రారంభం అవుతుందని, 2700 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి కాబోతున్నదని తెలిపారు. బసంత్ నగర్ వద్ద విమానాశ్రయంతోపాటు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చొరవతో నగరానికి ఐటీ టవర్స్ రాబోతుండడం శుభ పరిణామమన్నారు. ఉపాధి అవకాశాలు పెరిగి మరో రెండేళ్లలో నగర జనాభా రెట్టింపయ్యే అవకాశముందన్నారు. మానవ వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్, రామగుండంలో సీవరేజ్ ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయని, విఠల్నగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తి కాబోతున్నదన్నారు. నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, ఎనర్జీ సేవింగ్ అవార్డు, స్కోచ్ అవార్డులను కమిషనర్ అందుకోవడం శుభ సూచకమన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-21లో కూడా ఇతర నగరాలతో రామగుండం పోటీ పడుతుందన్నారు. రామగుండంను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు పూర్తయ్యాయన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.