న్యూఢిల్లీ, జూన్ 22: దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రతిపక్ష పార్టీల సీనియర్ నేతలు, ప్రతినిధులు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ ఇంట్లో మంగళవారం భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కరోనా వ్యాప్తి, వ్యవస్థలపై కేంద్రం దాడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. కేంద్రంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటములు కాకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందన్న రాజకీయ విశ్లేషకుల అంచనాల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. దీంతో థర్డ్ ఫ్రంట్ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ భేటీ రాజకీయపరమైనది కాదని సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు వార్తలను కొట్టిపారేశారు. సమస్యల పరిష్కారాలపై ఏకాభిప్రాయం ఉన్న వారంతా కలిశామని చెప్పారు. రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది.
శరద్ పవార్ ఈ సమావేశం ఏర్పాటు చేయలేదని ఎన్సీపీ నేత మజీద్ మెనన్ చెప్పారు. రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలో జరిగిందన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు కూటమి కడుతున్నాయనడం అబద్ధమని చెప్పారు. కాంగ్రెసేతర ఫ్రంట్ వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను కూడా సమావేశానికి పిలిచామని, కానీ వారు రాలేదని చెప్పారు. భేటీలో పాల్గొన్న ఇతర నేతలు కూడా ఇవే సంగతులు చెప్పారు. భేటీకి ముందు ఎన్సీపీ నేత ఒకరు.. పవారే సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన యశ్వంత్ సిన్హా 2018లో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రీయ మంచ్ పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు.
శరద్ పవార్ ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, రాష్ట్రీయ మంచ్ కన్వీనర్ యశ్వంత్ సిన్హా, సమాజ్వాదీ పార్టీ నుంచి ఘన్శ్యామ్ తివారీ, ఆమ్ఆద్మీ పార్టీ నుంచి సుశీల్ గుప్తా, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, సీపీఐ నుంచి బినయ్ విశ్వం, సీపీఐ(ఎం) నుంచి నీలోత్పల్ బసు తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ మాజీ నేత సంజయ్ ఘా, జనతాదళ్(యునైటెడ్) నేత పవన్ వర్మలతో పాటు జావెద్ అక్తర్, రిటైర్డ్ జడ్జి ఏపీ షా తదితరులు కూడా ఉన్నారు.
సమావేశంలో పాల్గొన్న నేతలు ఇది రాజకీయ భేటీ కాదని చెప్పినప్పటికీ.. తాజా పరిణామం ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుకు ఆరంభం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవార్, ప్రశాంత్ కిశోర్ భేటీ అయిన మరుసటి రోజే.. అది కూడా పవార్ నివాసంలోనే సమావేశం జరుగడం, బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఏర్పాటైన రాష్ట్రీయ మంచ్ ఇందులో బాగా క్రియాశీలకంగా ఉండటాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, రాష్ర్టాల్లో బీజేపీని ప్రాంతీయ పార్టీలు నిలువరిస్తుండటంతో.. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్తున్నారు.