హైదరాబాద్ :నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉపఎన్నికలో తన గెలుపు కోసం కృషి చేసిన మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ను ఎమ్మెల్యే నోముల భగత్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా భగత్ కోరారు. అదేవిధంగా తన గెలుపు కోసం కృషి చేసిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునీతను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 17న ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపును ఆదివారం(మే 2న) చేపట్టి ఫలితాలను ప్రకటించారు. సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18,804 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా తన గెలుపు కోసం కృషి చేసిన మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులకు భగత్ కృతజ్ఞతలు తెలిపారు.