న్యూఢిల్లీ: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ చెదురుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమబెంగాల్లో పోలింగ్ మందకొడిగా కొనసాగుతుండగా, అసోంలో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అసోంలో 37.06 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
తొలి విడుత ఎన్నికల్లో అసోంలో మొత్తం 47 స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. 264 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. అసోంలో మొత్తం మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనుండగా రెండో విడుత పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో విడుత పోలింగ్ ఏప్రిల్ 6న నిర్వహించనున్నారు. మే 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది.