లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పదుల సంఖ్యలో విధులకు డుమ్మా కొట్టారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఉన్నతాధికారులతో ఆకస్మిక తనిఖీలు జరిపించడంతో ఇది బయటపడింది. దీంతో విధులకు గైర్హాజరైన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి వివరణ కోరారు. భవిష్యత్తులో ఇలా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
యూపీ అధికారులు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తమ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించాలి. అయితే ఇది ఎలా సాగుతున్నది అన్నది తనిఖీ చేయాలని ఉన్నతాధికారులను సీఎం యోగి ఆదేశించారు. దీంతో శుక్రవారం ఆ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సంబంధిత ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 31 మంది జిల్లా కలెక్టర్లు, 24 జిల్లాల ఎస్పీలు తమ కార్యాలయాలకు లేదా ప్రభుత్వ కార్యక్రమాలకు గైర్హాజరైనట్లు తెలిసింది.
దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో శనివారం దీనిపై సమీక్షించారు. విధులకు డుమ్మా కొట్టిన వారి నుంచి వివరణ కోరారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని వార్నింగ్ ఇచ్చారు.
ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని సీఎం యోగి నొక్కిచెప్పారు. అధికారులు సమయం ప్రకారం కార్యాలయాలకు రావాలని, ప్రజల ఫిర్యాదులను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. అలసత్వం లేదా నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారంపై సీఎం యోగి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.