తిరువనంతపురం: కేరళ రాజకీయవేత్తల్లో పినరయి విజయన్ ఓ విశిష్టుడు. ఆయనపై ఎన్ని వివాదాస్పద ఆరోపణలు ఉన్నా.. రెండోసారి కేరళ పీఠాన్ని చేజిక్కించుకున్న ఘనుడు. సీపీఎం పార్టీ శ్రేణుల్లో ఇలాంటి నేత లేడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన ఈఎంఎస్ నంబూద్రిపాద్, ఏకే గోపాలన్, , పీ కృష్ణ పిళ్లై, సీహెచ్ కనరన్ లాంటి వాళ్లు కూడా విజయన్ లాంటి విజయాన్ని అందుకోలేదు. రాష్ట్ర రాజకీయాల్లో అతి సుదీర్ఘన కెరీర్ విజయన్ది. చాన్నా భిన్నమైన ప్రతిష్టకు ఆయన తార్కాణంగా నిలిచారు. ప్రజాజీవితంలో ఉన్న విజయన్పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ను ఎందరో విలన్గా చూపించారు. అయినా తన ఆదర్శ పాలనతో ఓటర్ల మనసును మళ్లీ దోచారు.
1998లో విజయన్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. గత అయిదేళ్లలో మీడియాతో ఆయనకు చాలా చేదు బంధమే ఎదురైంది. ప్రకృతి విపత్తు వేళ ఆయన్ను మీడియా తప్పుపట్టే ప్రయత్నం చేసినా.. విజయన్ మాత్రం తన అధికారాలను సక్రమంగా వినియోగించారు. కేరళ రాష్ట్ర చరిత్రలో వరుసగా రెండవ సారి సీఎం పదవిని దక్కించుకున్న ముఖ్యమంత్రిగా విజయన్ కొత్త రికార్డు సృష్టించారు. విజయన్ తన తల్లికి 14వ సంతానంగా జన్మించారు. నాస్తికుడిగా ఎదిగిన విజయన్ తన పార్టీకి మాత్రం కట్టుబడి పనిచేశారు. విజయన్ తండ్రి కల్లుగీత కార్మికుడు. 1960 దశకంలో విజయన్ సీపీఎంలో సభ్యత్వం తీసుకున్నారు. గవర్నమెంట్ కాలేజీలో బీఏ చదువుకున్న విజయన్.. కన్నూరు జిల్లాలో విద్యార్థి నాయకుడిగా అప్పట్లో రాణించారు. అరయకండి అచ్చుతన్ వద్ద రాజకీయ శిష్యరికం చేశారు.
1945లో పుట్టిన విజయన్ ఓ దశలో మావో లైను పట్ల ఆకర్షితులయ్యారు. దాదాపు నక్సలైట్గా మారారు. కానీ సీనియర్ నేతలు అప్పట్లో ఆయన్ను మళ్లీ సీపీఎం వైపు లాక్కు రావడంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. 1970లో విజయన్ 25 ఏళ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. మేటి నేతగా ఎదిగారు. ఆ తర్వాత తెరవెనుక రాజకీయవేత్తగా తన పథకాలను రచించారు. ఎమర్జెన్సీ సమయంలో ఎంవీ రాఘవన్తో కలిసి జైలు జీవితం గడిపారు. గడిచిన అయిదేళ్లలో విజయన్పై ఆరోపణలు వెల్లువలా వచ్చాయి. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ కేసులోనూ విజయన్ పాత్ర ఉన్నట్లు ఆరోపించారు. శబరిమల వివాదానికి విజయన్ కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.నిఫాతో పాటు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న తీరుపైనా విమర్శలు వచ్చాయి.
కానీ ఎన్నికల వేళ మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్.. విజయనే సీఎం అన్న అభిప్రాయాల్ని వినిపించాయి. కేరళకు శక్తివంతమైన నేత ఆయనే అన్న సందేశాన్ని చాటాయి. పవర్ఫుల్ నేతగా ఆయన ఆవిర్భవించారు. క్యాన్సర్ను జయించిన 75 ఏళ్ల విజయన్.. కేరళ రాజకీయాల్లో ఇప్పుడో కొత్త ట్రెండ్. విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 100 సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. ఆ ఘనత విజయన్కే దక్కుతుంది. ఎన్నికల ప్రచార వేళ.. విజయన్ను బైబిల్లోని జుడాస్ పాత్రతో మోదీ పోల్చారు. ఎవరెన్ని తీవ్ర విమర్శలు చేసినా..విజయనే హీరోగా నిలిచారు. శబరిమల వివాదంలోనూ విమర్శలు ఎదురైనా.. అయ్యప్ప దీవెనలు తనకే ఉంటాయని ఎన్నికల రోజున విజయన్ అన్నమాట మరవలేనిది.