పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ విమర్శించారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేసు నమోదు కోసం ఒక ఐఏఎస్ అధికారి ఐదు గంటలకు పైగా పోలీస్ స్టేషన్లో కూర్చున్నారని, అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదని తేజశ్వి ఆరోపించారు.
మరోవైపు సీఎం నితీష్ కుమార్తోపాటు మరికొందరిపై మోసం, నకిలీ పత్రాలు సృష్టించడంపై తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు గార్దనిబాగ్ ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు ఐఏఎస్ అధికారి, బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మాజీ చైర్మన్ సుధీర్ కుమార్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి పలు గంటలు వేచి ఉన్నా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. ఒక రసీదు మాత్రమే తనకు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
కాగా, సుధీర్ కుమార్ నుంచి ఫిర్యాదు తీసుకుని ఆయనకు రసీదు ఇచ్చామని పోలీస్ అధికారి అరుణ్ కుమార్ తెలిపారు. అందులోని అంశాలను చదివిన తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.