ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ ప్రభావం త్వరలో ఆరంభంకానున్న ఐపీఎల్ 2021పైనా పడింది. తాజాగా వాంఖడే స్టేడియంలో పనిచేసే 8 మంది గ్రౌండ్ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఐపీఎల్ పాలకమండలి అప్రమత్తమైంది. ముంబైలో మ్యాచ్ల నిర్వహణ సాధ్యంకాకపోతే ఎలా అనేదానిపై దృష్టిసారించింది.
ఏప్రిల్ 9 నుంచి ఈ ఏడాది సీజన్ మొదవలనుండటంతో ప్రస్తుతం కరోనా తీవ్రత తక్కువగా ఉన్న నగరాలపై దృష్టిసారించింది. వేరొక చోటకి మ్యాచ్ వేదికలను మార్చాలని భావిస్తే ప్రత్యామ్నాయంగా హైదరాబాద్, ఇండోర్లను స్టాండ్బైగా ఎంపికచేసింది. హైదరాబాద్లో కరోనా తీవ్రత తక్కువగానే ఉందని, ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ కొద్దిరోజుల కిందట బీసీసీఐని కోరిన విషయం తెలిసిందే. ఒకవేళ ముంబై నుంచి మ్యాచ్లను తరలించాల్సి వస్తే, ఆతిథ్యమిచ్చే అవకాశం హైదరాబాద్కు దక్కే అవకాశం ఉంది.
ఏప్రిల్ 10 నుంచి 25 మధ్య వాంఖడేలో మొత్తం పది ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఏప్రిల్ పదో తేదీన తలపడనున్నాయి. ‘కొవిడ్-19 కేసులకు సంబంధించి ప్రతీ మ్యాచ్ వేదికలను క్షుణ్ణంగా గమనిస్తున్నాం. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఇండోర్, హైదరాబాద్ స్టాండ్బైలో ఉన్నాయి. ఏం చేయాలనేదానిపై ఆలోచిస్తాం. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతకే తమ మొదటి ప్రాధాన్యతని’ ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.