సిటీబ్యూరో, మార్చి 7(నమస్తే తెలంగాణ): అడవులలో పెరిగే చెట్లు, రోడ్ల వెంబడి పిచ్చి పిచ్చిగా పెరిగే మొక్కలు అన్నీ ఆరోగ్యంగా పెరుగుతుండటం అందరికీ తెలిసిందే. ఈ మొక్కలకు ఎవరు బయట నుంచి ఎటువంటి పోషకాలు అందించకుండానే వాటంతటవే ఎదుగుతూ ఎలాంటి చీడపీడలు సోకకుండా పెరుగుతుంటాయి. అంటే అవి పెరిగే మట్టిలో నుంచి పోషకాలను తీసుకుంటాయి. కాబట్టే మట్టిలో అన్ని రకాల పోషకాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆదర్శ రైతు చింతల వెంకటరెడ్డి అన్నారు. ‘రైతు నేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో జరిగిన ప్రకృతి వ్యవసాయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు కుమారస్వామి, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు, సీఈఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, పలువురు రైతులు పాల్గొన్నారు.