హైదరాబాద్ : ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 1:48 గంటలకు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయమే ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలువురు వసంత్ విహార్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆఫీసు నిర్మాణ భూమి పూజ కార్యక్రమం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరగనుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ దక్షిణాది పార్టీకి ఢిల్లీలో కార్యాలయం లేదు. ఢిల్లీలో ఆఫీసు ఏర్పాటు చేసుకుంటున్న తొలి దక్షిణాది పార్టీ మాదే అని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.