హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ)/వనపర్తి: ప్రముఖ సామాజిక చరిత్రకారుడు సురవరం ప్రతాప్రెడ్డి తెలంగాణలో పుట్టిన ఆణిముత్యమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ శ్లాఘించారు. ప్రతాప్రెడ్డి 125వ జయంతి సందర్భంగా శుక్రవారం ట్యాంక్బండ్పై ఆయన విగ్రహానికి మంత్రి ఘన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి సురవరం ప్రతాప్రెడ్డి అన్నారు. తెలంగాణను ఎవరైనా కించపరిచినా, చిన్నచూపు చూసినా ఆయన ఏమాత్రం సహించేవారు కాదని, ఎందులోనూ తెలంగాణ తక్కువ కాదని దేశానికే చాటిచెప్పారని కొనియాడారు. తెలంగాణలో కవులే లేరని కొందరు ఎద్దేవా చేసినప్పుడు.. మాకూ వందలాది కవులతోపాటు గొప్ప సాహిత్యం, చరిత్ర ఉందంటూ ప్రతాప్రెడ్డి ధైర్యంగా పోరాడారని, గోల్కొండ పత్రికను స్థాపించి తెలంగాణ సాహిత్యాన్ని చాటిచెప్పారని తెలిపారు. ప్రతాప్రెడ్డి 125వ జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కుదరలేదని అన్నారు. ప్రస్తుతానికి ప్రతి జిల్లాలో జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని, పరిస్థితులు కుదుటపడ్డాక వచ్చే సంవత్సరం ఏడాదిపాటు జయంతి వేడుకలు నిర్వహిద్దామని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. తర్వాత సురవరం ప్రతాప్రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్గౌడ్ సన్మానించారు.
సురవరం.. ఓ సాహిత్య శిఖరం:
మంత్రి నిరంజన్రెడ్డి
సురవరం ప్రతాపరెడ్డి ఓ సాహిత్య శిఖరమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పలు రంగాల్లో తనదైన శైలిలో ముద్రవేసుకున్న సురవరం జీవితం భావితరాలకు మార్గదర్శకమని చెప్పారు. సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా వనపర్తి జిల్లాకేంద్రంలోని సురవరం పార్క్లో ఉన్న కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ సురవరం సాహితీవేత్తగా, పత్రిక సంపాదుకులుగా, రాజకీయవేత్తగా పలు రంగాల్లో రాణించి తెలంగాణ ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపింపజేసిన మహనీయుడని
కొనియాడారు.