గువహటి : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారి కట్టడికి అసోంలో రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత లేదని స్పష్టం చేశారు. రెండు నెలల్లో అసోంలో అత్యధిక జనాభాకు వ్యాక్సినేషన్ దిశగా తమ ప్రయాణం సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొవిడ్-19కు వ్యాక్సిన్ కనుగొన్న 12 దేశాల్లో భారత్ ఒకటని శర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తికి పూనుకునే కంపెనీలకు ఏడాది పాటు ఉచిత విద్యుత్ సబ్బిడీని అందించేలా నూతన పధకం త్వరలో ప్రకటిస్తామని ఓ జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు పూర్తి మద్దతు లభిస్తోందని చెప్పారు.