శాంతిభద్రతలు కాపాడటమే కాదు.. అన్నార్తులకు అండగా నిలుస్తున్న సిటీ పోలీసులు.. పర్యావరణ పరి‘రక్షణ’లోనూ ముందుంటున్నారు. భావితరాలకు ప్రాణవాయువును అందించేందుకు తమ వంతు తోడ్పాటునందిస్తున్నారు. ముఖ్యంగా సిటీ ఆర్మూడ్ రిజర్వు ఫోర్స్ హెడ్క్వార్టర్స్ ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతున్నది. అనువైన స్థలాలు ఉన్న చోట అంగుళం స్థలం కూడా వదలకుండా.. చెట్లు పెంచడంతో పచ్చదనం వెల్లివిరిస్తున్నది. నాటుతున్న మొక్కలను చంటి పిల్లల్లా కాపాడుకుంటూ.. అవి వృక్షాలుగా ఎదిగే వరకు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
కార్ హెడ్ క్వార్టర్స్లో అన్ని విభాగాలకు చెందిన సుమారు 5 వేల మంది సిబ్బంది ఉంటారు. పోలీసులకు శిక్షణకు కావాల్సిన మైదానం కూడా ఉన్నది. సిటీలో ఎక్కడైనా బందోబస్తుకు సిబ్బంది అవసరముంటే.. ఇక్కడి నుంచే ఫోర్స్ను పంపిస్తుంటారు. ఒకవైపు గ్రౌండ్ ..మరో వైపు కార్యాలయాలు, బ్యారక్లు ఇలా అన్నీ వేర్వేరుగా ఉంటాయి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ కార్ హెడ్ క్వార్టర్స్లో హరిత స్ఫూర్తి వెల్లివిరుస్తున్నది. పరిసరాలు ఆకుపచ్చని అందాలతో శోభిల్లుతున్నాయి. బ్యారక్లు, కార్యాలయాల పరిసరాలు, సుమారు 800 మీటర్ల విస్తీర్ణంలో ఉండే గ్రౌండ్ చుట్టూ ‘హరితం’ కనువిందు చేస్తున్నది. ఏటా హరితహారంలో ఇక్కడ కనీసం 150 మొక్కలు నాటుతుండగా, గతేడాది ఒకేసారి 500 నాటడం విశేషం.
మొత్తంగా సుమారు 1400 మొక్కలు నాటితే.. అందులో 1390 వరకు జీవించాయి. ఇన్చార్జిగా ఉన్న ఇన్స్పెక్టర్ శుభాన్గౌడ్ నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అనువైన నేల లేని చోట్ల…నల్ల, ఎర్రమట్టిని తెప్పించి.. మొక్కలను కాపాడటంతో అవన్నీ చెట్లుగా ఎదిగాయి. కాగా, సీపీ అంజనీకుమార్తో పాటు, అదనపు సీపీ డీఎస్ చౌహాన్, లా అండ్ ఆర్డర్ (కార్ హెడ్ క్వార్టర్స్ ఇన్చార్జి, అదనపు సీపీ)లు ఎప్పటికప్పుడు మొక్కల రక్షణపై ఆరా తీస్తూ ..వాటి పరిరక్షణకు చొరవ తీసుకోవడం విశేషం.
మొక్కలు నాటడంతోనే పని అయిపోదు. అవి నాటుకొని చెట్లుగా మారే వరకు దృష్టి పెట్టాలి. నీళ్లు, ఎరువులు వేస్తూ.. పర్యవేక్షిస్తుండాలి. కార్ హెడ్ క్వార్టర్స్లో నాటిన ప్రతి మొక్క జీవించి.. చెట్టుగా ఎదగాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఒకటి రెండు మినహా మిగతా మొక్కలన్నీ బతికాయి. వృక్షాలుగా మారుతున్నాయి. – డీఎస్ చౌహాన్, అదనపు సీపీ