పాట్నా: కరోనా మరణాలను బీహార్ మరోసారి దాచిపెడుతోందా? ఆ మధ్య తమ రాష్ట్రంలో కొవిడ్ మరణాల రికార్డును సవరించిన అదే రాష్ట్రంలో.. ఇప్పుడు ఏకంగా లెక్కల్లోకి రాని 75 వేల మరణాలు సంభవించినట్లు తేలింది. ఈ మరణాలకు కారణాలు ఏంటో తెలియనట్లుగా రికార్డుల్లో ఉంది. బీహార్ చూపించిన 7717 కొవిడ్ మరణాలకు ఇది దాదాపు పది రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2019లో జనవరి-మే మధ్య 1.3 లక్షల మరణాలు సంభవించాయి. అదే 2021లో మాత్రం వీటి సంఖ్య 2.2 లక్షలుగా ఉంది. అంటే 82500 (62 శాతం) ఎక్కువ. వీటిలోనూ సగానికిపైగా మరణాలు మే నెలలోనే సంభవించాయి. దీంతో బీహార్ కొవిడ్ మరణాలపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నెల మొదట్లో 3951 కొవిడ్ మరణాలను బీహార్ అదనంగా జోడించింది. ప్రభుత్వం చూపించిన కొవిడ్ మరణాలను తీసేసినా 74808 మరణాలు ఎప్పుడు, ఏ కారణంతో సంభవించాయన్నది మాత్రం తెలియలేదు. మరణాల సంఖ్య రిజిస్టర్ చేయడంలో బీహార్కు ఎప్పటి నుంచో చెడ్డ పేరు ఉంది. దీంతో ఇప్పుడు కూడా కొవిడ్ మరణాల విషయంలో ఆ రాష్ట్రం మరణాల సంఖ్యను చాలా తక్కువ చేసి చూపించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లోనూ మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపించారన్న అనుమానాల నేపథ్యంలో బీహార్లో ఇలా భారీ సంఖ్యలో కారణాలు లేని మరణాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.