గద్వాల,మార్చి 30 : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా మాట్లాడారు. పల్లెప్రగతి, హరితహారం, ధరణి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ఏర్పాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్రాల్లో తేమను కొలిచే యంత్రా లు ఉండాలని, రైతుల కోసం తాగునీటి వసతి కల్పించాలని, టెంట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్ కారణంగా భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, పౌరసరఫరాల, గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్ అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాలకు స్థల సేకరణ జరగని చోట వెంటనే చర్యలు చేపట్టి వనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతుల కల్లాల విషయంలో లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. గతేడాది కంటే ఉపాధి కూలీలకు అదనంగా 60శాతం ఎక్కువగా వేతనాలు చెల్లిస్తున్నామని ఉపాధి పనుల ద్వారా వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, రైతు కల్లాలు, కంపోస్ట్షెడ్లు అభివృద్ధి పనులు గ్రామాల్లో జరుగుతున్నాయన్నారు. 10శాతం గ్రీన్ బడ్జెట్ను పట్టణ ప్రగతిలో వినియోగించుకోవాలని సూచించారు.
నర్సరీలోని ప్రతి మొక్క బతికేలా చూడాలన్నారు. ఇంటి అవసరాలకు ఇచ్చే ఆరు మొక్కలపై శ్రద్ధ వహించాలన్నారు. ప్రత్యేక అధికారులు గ్రామాల్లోని నర్సరీల నిర్వహణను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో ప్రతి మున్సిపాలిటీలో రెండు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ఏర్పాటుకు మూడు రోజుల్లో ప్రణాళిక రూపొందించి ఆరునెలల్లో పూర్తి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. పీహెచ్సీ, సీహెచ్సీ కేంద్రాల్లో కొవిడ్ పరీక్షలు పెంచాలని పాజిటివ్ వచ్చిన వారిని వారిని కలిసిన వారి వివరాలు గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. ప్రతి దవాఖానలో ఆక్సిజన్తోపాటు అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ శృతిఓఝా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కొవిడ్కు సంబంధించి అన్ని దవాఖానల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. వీసీలో హైదరాబాద్ నుంచి మున్సిపల్ పరిపాలన విభాగం అధికారి అరవింద్కుమార్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సందీప్ కుమార్సుల్తానియా, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ వీరితో పాటు డాక్టర్ సత్యనారాయణ, అనిల్, హరితహారం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్ తదితరులు పాల్గొనారు. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఆర్డీవో రాములు, డీఎంహెచ్వో చందూనాయక్, డీఆర్డీవో ఉమాదేవి పీఆర్ఈఈ సమత పాల్గొన్నారు.