విద్యానగర్/ ఖలీల్వాడి, ఏప్రిల్ 8: ఉమ్మడి జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ల్లో మొత్తం 406 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. ఆర్మూర్ పట్టణంలోని వంద పడకల దవాఖానలో 199 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్ వచ్చినట్లు దవాఖాన సూపరింటెండెంట్ నాగరాజు తెలిపారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానతో పాటు రాకాసిపేట్ అర్బన్ హెల్త్ సెంటర్, పాన్గల్లీ అర్బన్ హెల్త్ సెంటర్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 116 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో 88 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్ వచ్చినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో కేసులు పెరుగుతుండడంతో స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో 2,360 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 303 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 15,183 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 103 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖఅధికారి సుదర్శనం తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,059 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
అంతర్రాష్ట్ర సరిహద్దులో నిలిచిన రాక పోకలు
మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల్లో కరోనా తాకిడి తీవ్రంగా ఉంది. దాని ప్రభావం మన రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు చాపకింద నీరులా వ్యాపించడంతో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. దీంతో అప్రమత్తమైన అధికారులు రెంజల్ మం డలం కందకుర్తి గ్రామశివారులో అంతర్రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్టు వద్ద రాకపోకలను నిలిపివేశారు. గురువారం రెంజల్ పోలీసులు వచ్చి పోయే వాహనాల రాక పోకలను నిలిపి వేస్తూ రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి మాత్రమే అనుమతించేలా పోలీసులు ఆంక్షలు విధించారు.
పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అమలుచేస్తున్నారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో ఈనెల 8నుంచి 25 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు నిర్ణయించగా, గ్రామస్తులు మద్దతు తెలిపారు. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపు ఉంటుందని, మాస్కు లేకుండా కనిపిస్తే రూ .5వందలు జరిమానా విధిస్తామని ఎంపీడీవో గోపాలకృష్ణ హెచ్చరించారు.
సాలూరా క్యాంప్లో..
బోధన్ మండలం సాలూరా క్యాంప్ గ్రామంలో నాలుగైదు రోజులుగా 20 మందికి పైగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో లాక్డౌన్ విధించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. పది రోజులపాటు గ్రామంలో లాక్డౌన్ కొనసాగనుంది. ఇందులో భాగంగా గురువారం దుకాణాలు, హోటళ్లను మూసివేశారు.
చిన్నఎక్లారాలో..
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని చిన్నఎక్లారా గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు. గ్రామంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున 15 రోజుల పాటు లాక్డౌన్ అమలులో ఉంటుందని సర్పంచ్ భీంరావు తెలిపారు. తమ గ్రామంలోకి ఇతరులు ఎవరూ రావొద్దని, గ్రామం నుంచి ఎవరూ బయటికి వెళ్లవద్దని తీర్మానం చేశారు. గ్రామంలో బుధవారం 49, గురువారం 48 కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ తెలిపారు.
ఫ్యాక్టరీలో 26మందికి కరోనా పాజిటివ్
నిజామాబాద్ మండలంలోని కేశాపూర్ గ్రామ శివారులో ఉన్న కోల్డ్ స్టోరేజీ, ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్న 26మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ముదక్పల్లి పీహెచ్సీ వైద్యుడు నవీన్ తెలిపారు. వారిని కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించిన గదుల్లో హోంక్వారంటైన్లో ఉంచేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మరో పది మందిని నిజామాబాద్లోని వారి స్వగృహాల్లో హోం క్వారంటైన్ ఉండాలని సూచించినట్లు ఆయన తెలిపారు.
జోరుగా వ్యాక్సినేషన్
ఉమ్మడి జిల్లా లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసా గుతున్నది. గురువారం నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2750 మందికి గాను 1586 మంది కరోనా టీకా వేసు కున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 30 కేంద్రాల్లో మొ త్తం 3,411 మందికి కొవిడ్ టీకా వేసినట్లు వైద్యాధి కారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 65,646 మంది కొవిడ్ టీకా తీసుకున్నారని పేర్కొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
దవాఖాన నుంచి సచిన్ డిశ్చార్జి
ఎన్హెచ్-163కు రూ. 254 కోట్లు